పంట నష్టాలు, బోర్లు బూడిపోవడంపై రైతుల ఆగ్రహం
రోడ్డు నిర్మాణం, వాటర్ ప్లాంట్లకు కంపెనీ ప్రతినిధుల హామీ
కడప జిల్లా జూలై 13 ప్రజావాణి బ్రహ్మంగారి మఠం మండలం రేకలకుంట పంచాయతీ పరిధిలోని రైతులు గత 10 రోజులుగా చేపట్టిన శాంతియుత నిరసనలు ఎట్టకేలకు ఫలించాయి. తమ సమస్యలపై స్పందించాలంటూ స్థానిక రిత్విక్ కంపెనీ ఎదుట రైతులు ఆందోళనలు చేపట్టగా,సోమవారం కంపెనీ యాజమాన్యం రైతులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈ చర్చల్లో రైతుల డిమాండ్లకు కంపెనీ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించడంతో వివాదం సద్దుమణిగింది. రేకులకుంట,బాలాజీ నగర, బాగాదిపల్లె,గొల్లపల్లె,జెడ్.కొత్తపల్లె,డి.అగ్రహారం,టి రామాపురం,వాంపల్లి చెరువు గ్రామాలకు చెందిన రైతులు గత పది రోజులుగా రిత్విక్ కంపెనీ వద్ద పలుమార్లు నిరసనలు తెలియజేశారు. గత మూడేళ్లుగా ఈ కంపెనీ వల్ల స్థానిక ప్రజలకు,రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ పనుల వల్ల విపరీతంగా దుమ్ము,ధూళి లేచి పంటలపై పడుతుండటంతో చేతికి రావాల్సిన పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ పరిధిలో జరుపుతున్న భారీ బ్లాస్టింగ్ల కారణంగా భూగర్భంలో మార్పులు వచ్చి,బోర్లలోని పైపులు ఇరుక్కుపోతున్నాయని,వాటిని బయటకు తీయడం సాధ్యం కాక ఎంతో మంది రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.స్థానిక నీటి వనరులను కంపెనీ వాడుకుంటూ,తమకు మాత్రం నష్టాన్ని మిగులుస్తోందని ఆరోపించారు.ఈ సమావేశంలో రైతులు ఒక కీలకమైన ప్రతిపాదనను యాజమాన్యం ముందుంచారు. ప్రస్తుతం రేకలకుంట పంచాయతీ ప్రజలు మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠం వెళ్లాలంటే దాదాపు 40 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. అయితే, తెలుగుగంగ (బ్రహ్మసాగర్) నుంచి కడపకు నీటిని తరలించేందుకు వేసిన పైప్లైన్ పనుల పరిశీలన కోసం ఇప్పటికే రేకలకుంట గంగమ్మ ఆలయం, నూతన సచివాలయం వద్ద నుంచి ఒక రహదారిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు రిత్విక్ కంపెనీ నిర్మించిన రోడ్డు నుంచి కేవలం 3 కిలోమీటర్ల లింక్ రోడ్డును ఏర్పాటు చేస్తే, మండల కేంద్రానికి వెళ్లే దూరం దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల మేర తగ్గుతుందని,ఇది ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, స్థానిక అభివృద్ధికి కంపెనీ సహకరించాలని డిమాండ్ చేశారు.కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చలలో రిత్విక్ కంపెనీ తరపున లైజరింగ్ మేనేజర్ జయప్రకాష్,జనరల్ మేనేజర్ తిరుమురుగన్,హెచ్ ఆర్ కిరణ్,మేనేజర్ విష్ణువర్ధన్ తదితర ఉన్నతాధికారుల బృందం పాల్గొంది. రైతులు అడిగిన అంశాలన్నీ న్యాయమైనవేనని కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు.
రైతులు కోరిన రోడ్డు నిర్మాణానికి సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి ఎస్టిమేషన్ వేయించి పనులను ప్రారంభిస్తామని,అలాగే వాటర్ ప్లాంట్ల ఏర్పాటు,తర అభివృద్ధి పనులను కూడా త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు.రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తరపున పూర్తి సహకారం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ తమ నిరసనలను విరమించారు.ఈ సమావేశంలో రేకలకుంట పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల రైతులు,స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు




