ఘట్కేసర్, జూలై 10: ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పలు హోటళ్లలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
డిప్యూటీ కమిషనర్ ఎ. వాణి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి నీలీషా, ఘన వ్యర్థాల నిర్వహణ విభాగం ఉప కార్యనిర్వాహక ఇంజనీర్, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు.
తనిఖీలలో భాగంగా టులిప్స్ రెస్టారెంట్, ఆర్ రాయల్ బావర్చి, పరివార్ రెస్టారెంట్, అక్షిత్స్ టాండూరి ఫ్యూజన్ ఢాబాలను పరిశీలించారు. వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంట పాత్రల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆహార భద్రతా ప్రమాణాల అమలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు హోటల్ యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు. ఆహార భద్రతా నిబంధనలు, భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వవద్దని హెచ్చరించారు.
ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలపై ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.





