•చెట్లు నరికారు.. కొమ్మలు వదిలేశారు.. ఇబ్బందుల్లో కాలనీవాసులు
అమీన్పూర్, జూలై 2 (ప్రజావాణి):అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కేజీఆర్ ఎంక్లేవ్, ఓడీఎఫ్ కాలనీల్లో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ ఇటీవల నరికివేశారు. అయితే, వారం రోజులు గడిచినా ఆ కొమ్మలను తొలగించకపోవడంతో అవి రోడ్లపైనే పేరుకుపోయి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
రోడ్లపై నరికిన కొమ్మలు ఉండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసే సమయంలో ఈ కొమ్మలు డ్రైనేజీల్లోకి చేరి నీటి పారుదలకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పాములు, ఇతర విషపురుగులు చేరే అవకాశం ఉండటంతో చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారు.నరికిన చెట్ల కొమ్మలను వెంటనే తొలగించి కాలనీలను పరిశుభ్రంగా ఉంచేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి పనులు పూర్తయిన వెంటనే చెట్ల కొమ్మలను తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


