బెజ్జంకి,జూన్ 22 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో కొందరు లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో, వారి స్థానాల్లో అర్హులైన కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి మొత్తం 76 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదవారి సొంతింటి కలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వచ్చే నెల జూలైలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.ఇప్పటివరకు మానకొండూరు నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, ఎంపీడీవో కడివెర్గు ప్రవీణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్, ఏఈఈ రవళి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్, జెల్ల ప్రభాకర్, అక్కరవేణి పోచయ్య, నారాయణరెడ్డి, రావుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.




