తిరుమలాయపాలెం, ప్రజావాణి, జూన్ 19:
తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షానికి ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్రామానికి చెందిన దంతాల వెంకన్న (వీఆర్ఏ) నివాసముంటున్న పెంకుటిల్లు గురువారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది.ఇంటి లోపల నిద్రిస్తున్న వెంకన్నపై మట్టి గోడలు పడటంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, ఎడమ కాలు విరిగింది. ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి వెంకన్నను కాకరవాయి గ్రామంలోని వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.అయితే మెరుగైన వైద్యం కోసం అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో వెంకన్న కుటుంబం ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థిక సాయం మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.మరోవైపు భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో వెంకన్న, ఆయన భార్య నివాసం లేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తలదాచుకునేందుకు సైతం చోటు లేక రోదిస్తున్న వారి పరిస్థితి గ్రామస్థులను కంటతడి పెట్టిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి గృహ సహాయం, నష్టపరిహారం అందించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




