కడప జిల్లా పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 11) దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రేపు (జూన్ 12, 2026) పోరుమామిళ్లలో ఒక భారీ భూ సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పోరుమామిళ్ల స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.ఈ పరిష్కార వేదికకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (JC), బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO)తో పాటు స్థానిక మండల తహశీల్దార్లు స్వయంగా హాజరవుతున్నారు. ఉన్నతాధికారులు నేరుగా ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిశీలించనున్నారు.
అధికారుల నిర్లక్ష్యానికి చరమగీతం పాడాలి:
ఈ సందర్భంగా ముత్యాల ప్రసాద్ రావు మాట్లాడుతూ,రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సామాన్యుల సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. కుటుంబాల్లోని వ్యక్తులు మరణించిన తర్వాత, వారి భూములను వారసుల పేరిట ఆన్లైన్ చేయించుకోవడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. అధికారుల అలసత్వం కారణంగా వందలాది ఫైళ్లు కార్యాలయాల్లో దుమ్ముధూళి పేరుకుపోయి పెండింగ్లో ఉన్నాయని ఘాటుగా విమర్శించారు.సామాన్యుడి భూ హక్కులను కాలరాసే ఇలాంటి పెండింగ్ ఫైళ్లకు తక్షణమే మోక్షం కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు.
బాధితులకు పిలుపు:
పోరుమామిళ్ల, బి.కోడూరు, శ్రీ అవధూత కాశినాయన, కలసపాడు మండలాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల బాధితులు ఈ అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న భూ వివాదాలు, ఆన్లైన్ కానటువంటి రికార్డుల సమస్యలపై రేపు ఉదయమే పద్మావతి కళ్యాణ మండపానికి చేరుకోవాలని కోరారు. తమ సమస్యలను స్పష్టమైన అర్జీల రూపంలో అధికారులకు సమర్పించి, అక్కడికక్కడే పరిష్కారాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల పక్షాన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రసాద్ రావు స్పష్టం చేశారు.
పోరుమామిళ్లలో అధికారుల సమక్షంలో భూ సమస్యల పరిష్కార వేదిక – రేపే ప్రత్యేక కార్యక్రమం
RELATED ARTICLES




