దళిత బహుజన బిడ్డ విజయ్ దళపతి సీఎం కావడం గర్వకారణం
కోదాడలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు
విజయ్ దళపతి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుంటూ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
కోదాడ, మే 11 / ప్రజావాణి : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆదేశాల మేరకు, ఎమ్మార్పీఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దళిత బహుజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం దేశంలోని బహుజన సమాజానికి గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు చింత బాబు మాదిగ మాట్లాడుతూ, ఒక దళిత బహుజన బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశ బహుజన సమాజానికి చారిత్రాత్మక ఘట్టమన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయ్ తమిళనాడులో సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. భావితరాలకు బహుజన రాజ్య స్థాపనకు మార్గం సుగమం చేయాలని కోరారు.
కొన్ని మనువాద శక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిని అధిగమించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కాంపాటి శ్రీనివాస్, గంధం యాదగిరి, షేక్ బాగ్దాద్, కందుకూరి నాగేశ్వరరావు, పాలడుగు సంజీవ్, గంధం శ్రీను, గంధం జాని, పిడమర్తి బాబురావు, అమరబోయిన శ్రీకాంత్, కుడుముల రాంబాబు, బొల్లెపోగు చంటి, చింతా వినయ్, సోమపంగు శ్రీను, సిద్ధల రాంబాబు తదితర ఎంఆర్పీఎస్ నాయకులు మరియు డేగ బుడగ జంగాల నాయకులు పాల్గొన్నారు.





