ఘట్కేసర్, మే 10 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఘట్కేసర్–పోచారం సర్కిల్ పరిధిలోని 8వ వార్డు అన్నోజిగూడ సాయి నగర్ కాలనీ యువత ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లో ఆదివారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సాయి నగర్ నుంచి ఘట్కేసర్ మైసమ్మ గుట్ట వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి, మాజీ ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి హాజరై ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి దిశానిర్దేశం చేస్తోందని, తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రతి కుటుంబానికి చేరుతోందన్నారు. మేడ్చల్ ప్రజల్లో మోడీ పట్ల ఉన్న ప్రేమ, విశ్వాసం, అభిమానానికి ఈ భారీ జనసంద్రం నిదర్శనమని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఏ. భరత్ రెడ్డి, బైక్ ర్యాలీ ఇన్చార్జి ఎన్. కృష్ణ గౌడ్, బీజేపీ నాయకులు బాలేష్, గుండె నరేష్, రమేష్ నాయుడు, గుర్రం అనిల్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు


