ఘట్కేసర్, మే 1 (ప్రజావాణి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్ మండలంలో 141వ మే డే వేడుకలను వివిధ కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కార్మికులు, హెచ్పిసిఎల్ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఆస్పత్రి ఔట్సోర్సింగ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు భారీగా పాల్గొన్నారు.
ఘట్కేసర్ టౌన్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిహెచ్ఎంసి ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు జై చంద్ర, సిపిఐ మండల నాయకులు లొట్టి ఈశ్వర్ మాట్లాడుతూ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా విభజించడం వల్ల కార్మికుల హక్కులు హరించబడ్డాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారని, ఏఐటియుసి ఆధ్వర్యంలో ఇతర కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత బలంగా కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు జయచంద్ర, సయ్యద్ ఖదీర్, రామ్ చందర్, రామ్ కుమార్, ప్రభుత్వ ఆస్పత్రి యూనియన్ నాయకురాలు భాగ్యలక్ష్మి, సదాశివ, మురళి, చౌదరి, సువర్ణ, అందాలు, రేణుక, రాజు, సంజీవ, పాండు, ఎన్ రాములు, ఎల్లయ్య, రాజు, సరిత, మైసయ్య, అరుణ, పురుషోత్తం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


