ఘట్కేసర్, మే 1 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ పరిధిలో యువతి అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, కొండాపూర్కు చెందిన బొంత సరిత తన కూతురు మమత (26) అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మమత తన భర్త పోచయ్యతో నెల రోజుల క్రితం జరిగిన కుటుంబ వివాదాల కారణంగా కామారెడ్డి నుంచి తన ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి సరిత వద్దకు వచ్చి నివసిస్తోంది. ఈ క్రమంలో మే 1న ఉదయం సుమారు 10 గంటల సమయంలో కిరాణా దుకాణానికి వెళ్లి వస్తానని చెప్పి, తన చిన్న కుమారుడు జోసెఫ్ (2)తో కలిసి బయటకు వెళ్లింది.
అయితే, వెళ్లిన మమత ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి సరిత ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.

