📄 ePaper
Sunday, April 19, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyవిద్యతోనే సమాజ మార్పు*-ఎడ్యుకేషన్ హబ్‌గా అందోల్ అభివృద్ధి-మంత్రి దామోదర్ రాజనర్సింహ

విద్యతోనే సమాజ మార్పు*-ఎడ్యుకేషన్ హబ్‌గా అందోల్ అభివృద్ధి-మంత్రి దామోదర్ రాజనర్సింహ

📰 Generate e-Paper Clip

*విద్యతోనే సమాజ మార్పు*
-ఎడ్యుకేషన్ హబ్‌గా అందోల్ అభివృద్ధి
-మంత్రి దామోదర్ రాజనర్సింహ
-అందోలులో మంత్రి సుడిగాలి పర్యటన
-రూ. 27.76 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.
-పాలిటెక్నిక్‌లో రూ. 43 లక్షలతో మెకానికల్ వర్క్‌షాప్ ప్రారంభం.
-నియోజకవర్గంలో విద్యాసంస్థల విస్తరణకు ప్రాధాన్యం
*మన సమగ్ర ప్రజావాణి, అందోలు నియోజకవర్గం- ఏప్రిల్ 18:*
విద్యే సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో నిర్వహించిన సుడిగాలి పర్యటనలో భాగంగా విద్యా అభివృద్ధి, మౌలిక వసతుల పెంపుపై ఆయన దృష్టి సారించారు. శివంపేట పాలిటెక్నిక్ కళాశాలలో న్యూ హాలాండ్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు రూ. 43 లక్షలతో నిర్మించిన మెకానికల్ వర్క్‌షాప్ షెడ్‌ను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యతోనే జీవితాల్లో వెలుగులు నిండుతాయని, అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలో ఇప్పటికే పాలిటెక్నిక్, జేఎన్టీయూ ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, వ్యవసాయ, మహిళా కళాశాలలతో పాటు మోడల్, రెసిడెన్షియల్, కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. బాలికల భద్రత, వసతుల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. సిఎస్ఆర్ నిధులు రూ. 10 కోట్లతో నియోజకవర్గంలోని విద్యాసంస్థలలో మౌలిక వసతుల మెరుగుదల పనులు  చేపడుతున్నట్లు వివరించారు.
ఇదిలా ఉండగా మంత్రి తన పర్యటనలో భాగంగా రూ. 27.76 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
అందోల్‌లో రూ. 1.80 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించగా, చెరువు కట్ట వద్ద రూ. 5 కోట్లతో నిర్మించనున్న పర్యాటక రెస్టారెంట్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 20 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయం పనులను ప్రారంభించారు. రూ. 53 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనం మొదటి అంతస్తును ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయని సూచించారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ పాండు, ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్, న్యూ లాండ్ ఫౌండేషన్  ప్రతినిధి డి.వి రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఎ. సత్యనారాయణ ( చిట్టిబాబు), కౌన్సిలర్లు సర్పంచ్ సంధ్యా రాణి,  సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular