సిద్దిపేట్, ఏప్రిల్ 5, ప్రజావాణి
సిద్దిపేట జిల్లాలో ఇసుక సరఫరా ప్రక్రియను మరింత పారదర్శకంగా, అవినీతి రహితంగా మరియు సామాన్యులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం “మన ఇసుక వాహనం” పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా ప్రజలు ఇకపై దళారులను ఆశ్రయించకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ తెలిపారు. ముందుగా అధికారిక వెబ్సైట్ https://tgmiv.cgg.gov.in ను సందర్శించి, వివరాలతో రిజిస్టర్ చేసుకొని , దరఖాస్తు సమర్పించిన తర్వాత నిర్ణీత రుసుమును ఆన్లైన్లో చెల్లించాలి. మీ దరఖాస్తును సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు తహసీల్దార్ పరిశీలించి ఇసుకను మంజూరు చేస్తారు.తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ఇసుక రేట్లు చెల్లించాలి. పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. సిద్దిపేట జిల్లా ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిపి తెలియజేశారు.




