విద్యార్థులకు బాల్యం నుంచే ప్రజాస్వామ్య విలువలు,నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించాలి
ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హై స్కూల్లో విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు,నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించేందుకు పాఠశాల నమూనా ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పాఠశాల ప్రధాన విద్యార్థి నాయకుడు, సహాయ ప్రధాన విద్యార్థి నాయకుడు, క్రీడావిభాగం ప్రతినిధుల ఎంపిక కోసం ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు.
అభ్యర్థులు తమ లక్ష్యాలు, ఆలోచనలను తోటి విద్యార్థులకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం విద్యార్థులు తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసి నాయకులను ఎన్నుకునే విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పుస్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు బాల్యం నుంచే ప్రజాస్వామ్య విలువలు,నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, బాధ్యత, సమిష్టి భావన, నిర్ణయాత్మకత వంటి లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మర్రి అశోక్, వైస్ ప్రిన్సిపాల్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రె తిరుపతితో పాటు ఉపాధ్యాయులు సరిత, లావణ్య, ఆశా బేగం, సురేష్, రమేష్, కృష్ణ, మమత, కవిత, లలిత తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

