•ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఫైర్
•పటాన్చెరులో బీఆర్ఎస్ రాస్తారోకో, ధర్నా..
• ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్ర: మాద్రి పృథ్వీరాజ్ ఆగ్రహం
పటాన్చెరు, సెప్టెంబర్ 7 (ప్రజావాణి): అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్న తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనలో సీనియర్ నాయకులు గూడెం మధుతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం నేరమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల హక్కులను అడ్డుకునేలా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ప్రతిపక్షం గొంతు నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పృథ్వీరాజ్ అన్నారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం సాధ్యం కాదని, బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ఎంపీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

