క్యాట్రియల్ తండాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
రామాయంపేట మండలంలోని క్యాట్రియల్ తండాలో శ్రీ సంత్ సేవాలాల్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభించారు. వినాయక చవితి తొలి రోజు సందర్భంగా యువజన సంఘం సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా
కార్యక్రమాలను నిర్వహించారు. గణనాథుడికి పుష్పాలు, పండ్లు, నైవేద్యాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తండాలో ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. యువకులు, మహిళలు, చిన్నారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. వినాయకుడి నామస్మరణతో తండా పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

