తంగళ్లపల్లి ప్రజావాణి ఆగస్టు 14 కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలను అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండల తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా హమాలీ కార్మికుల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.ప్రధానంగా హమాలీ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, ప్రతి కార్మికుడికి హెల్త్ కార్డు జారీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించడం, గుర్తింపు కార్డులు జారీ చేసి అసంఘటిత కార్మికులుగా నమోదు చేయడం, ఈ-శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసి సామాజిక భద్రత పథకాలు అమలు చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.అలాగే 55 సంవత్సరాలు పైబడిన హమాలీ కార్మికులకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని, ఇళ్లు లేని కార్మికులకు 120 గజాల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మంచినీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, సైకిల్ స్టాండ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు.పని చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన హమాలీ కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని, ఐఎల్ఓ తీర్మానం ప్రకారం 50 కిలోలకు మించిన బరువును మోయడాన్ని నిషేధించాలని కోరారు. ప్రమాద బీమా, సహజ మరణ పరిహారం, ఆరోగ్య బీమా, విద్యా సహాయం, ప్రసూతి ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాజశేఖర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హమాలీ మండల అధ్యక్షుడు మరికంటి నరసయ్య, క్యారం పరశురాములు, చెరుకు రాజు, గుంటి ఎల్లయ్య, చక్రాల ఎల్లయ్య, రంగు బుచ్చయ్య, శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి సీఐటీయూ
RELATED ARTICLES

