ఓగ్లాపూర్లో యువకుడి దుర్మరణం
హన్మకొండ ప్రజావాణి, దామెర:21 హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగాపూర్ గ్రామంలో జరిగిన ఓ విషాద ఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓగాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కన్నెర లక్ష్మి కుమారుడు కన్నెర అభిలాష్ (26) గురువారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కాలనీలోకి మద్యం మరిగించుకుని ఇంటికి వస్తుండగా ఓగాపూర్ వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురయ్యాడు.
గంగిరేణిగూడెం వైపు నుంచి వస్తున్న పండ్ల అజారుద్దీన్ (30) తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి అభిలాష్ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అభిలాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దామెర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. అభిలాష్ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

