📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రజా ప్రయోజనాలకు భంగం కల్గిస్తే చూస్తూ ఊరుకోం: లీజు పేరుతో రెవిన్యూ స్థలాన్ని కాజేసే ప్రయత్నాలపై...

ప్రజా ప్రయోజనాలకు భంగం కల్గిస్తే చూస్తూ ఊరుకోం: లీజు పేరుతో రెవిన్యూ స్థలాన్ని కాజేసే ప్రయత్నాలపై ప్రజా, జర్నలిస్ట్ సంఘాల తీవ్ర ఆగ్రహం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల, జులై 16: ప్రజావాణి స్థానిక రెవిన్యూ కార్యాలయ ప్రాంగణంలో ప్రజా ప్రయోజనాలను కాలరాస్తూ, ప్రభుత్వ స్థలాన్ని లీజు పేరుతో స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. మైదుకూరు రోడ్డు వైపు ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ స్థలంపై కొంతమంది స్వార్థపరుల కన్ను పడిందని, ఎలాగైనా ఆ స్థలాన్ని కాజేసేందుకు తెరవెనుక ముమ్మరంగా పావులు కదుపుతున్నారని వారు ఆరోపించారు.
ప్రధాన ముఖద్వారాన్ని మాయం చేసే కుట్ర:
ప్రభుత్వ రికార్డుల ప్రకారం అధికారికంగా ప్రజల రాకపోకల కోసం కేటాయించిన ప్రధాన ముఖద్వారాన్ని (మెయిన్ గేట్) సయితం మాయం చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించగా, ఆయన సదరు స్థలంలో పునాదులు తీసేందుకు వీలుగా తెల్లటి సున్నపు గీతలతో మార్కింగ్ కూడా పూర్తి చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విలేకరులు తక్షణమే స్పందించి నిర్మాణ ప్రయత్నాలను గట్టిగా అడ్డుకున్నారు.
ప్రజలకు, అత్యవసర సేవలకూ తీవ్ర ఆటంకం:
ఈ ప్రాంగణంలోనే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కొలువై ఉన్నాయి. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, రైతులు, మహిళలు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలతో పాటు కార్యాలయాల సిబ్బంది ఇటువైపే రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ప్రధాన ముఖద్వారాన్ని మూసివేస్తే, ఈ ప్రాంత పరిధిలోని ఆరు బూతుల ప్రజలు కార్యాలయాల్లోకి వెళ్ళడానికి దారి లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా, ప్రమాదవశాత్తూ ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఫైర్ ఇంజన్ లేదా అంబులెన్స్ వంటి వాహనాలు లోపలికి రావడానికి మార్గం లేక ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సొమ్ము..ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి!
“సొమ్మొకడిది… సోకొకడిది” చందాన ప్రభుత్వ స్థలాన్ని, జిల్లా పరిషత్ (జడ్పీ) నిధులను వాడుకుంటూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి, దాని ద్వారా వచ్చే బాడుగలను (అద్దెలను) మాత్రం అక్రమ లీజుదారుడు అనుభవించేలా ఈ కుంభకోణానికి తెరలేపారని నాయకులు మండిపడ్డారు. ఒక వ్యక్తి స్వార్థపూరిత ఆలోచనలకు, ఆయన సొంత పార్టీలోని కొందరు సహచరులు వత్తాసు పలకడం వల్లే ఈ అక్రమ తతంగం నడుస్తోందని హితవు పలికారు.వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను తుంగలో తొక్కితే సహించే ప్రసక్తే లేదని, ఈ దుర్మార్గపు చర్యలను అడ్డుకోవడానికి ఆ ప్రాంత ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడటానికి సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మార్కింగ్‌లను, నిర్మాణ ప్రయత్నాలను శాశ్వతంగా నిలిపివేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.