11 కోట్ల అప్పుల వివాదం జితేందర్ రెడ్డి ఇంటి ముందు బాధితులు టెంట్ వేసి ఆందోళన……
తమ కష్టార్జితం తక్షణమే ఇప్పించాలని రైతుల వేడుకోలు..
రోడ్డున పడ్డామంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ముందే రైతుల ధర్నా..
కోదాడ, జూన్ 02/ ప్రజావాణి
కోదాడ సమీపంలోని శ్రీరంగపురంలో ఇరిగేలా జితేందర్ రెడ్డి చేతిలో మోసపోయిన బాధితులు మంగళవారం ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన సుమారు 11 కోట్ల రూపాయల అప్పులను తక్షణమే ఇప్పించాలంటూ సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి జితేందర్ రెడ్డి ఇంటి ఎదుట టెంట్ వేసి బైఠాయించారు.వ్యవసాయ పెట్టుబడుల కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులు తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మా డబ్బులు మాకు ఇప్పించే వరకు ఈ టెంట్ తీసేది లేదు ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని ఆందోళన చేపట్టారు.నమ్మి అప్పులు ఇస్తే, చివరకు చేతులెత్తేసి ఐపీ (దివాలా) నోటీసులు పంపడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న సొమ్ము పోవడంతో తాము రోడ్డున పడ్డామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుల నుంచి సొమ్మును రికవరీ చేసి, తమకు తక్షణమే న్యాయం చేయాలని బాధితులు పోలీస్ అధికారులను వేడుకుంటున్నారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధితులకు సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించి వేశారు.





