సిద్దిపేట, మే 19(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఛేదించారు. కొమురవెల్లి, బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
అరెస్ట్ చేసిన నిందితులు రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను, ఇంటి బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు.
అదనపు డీసీపీ కుశాల్కర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా, వేచరేణి గ్రామ పరిధిలో గుర్జకుంట కమాన్ వద్ద వాహన తనిఖీల సమయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వివరాలు
ముడావత్ కాల్య (37) – ఆటో డ్రైవర్,
ముడావత్ పాండు (38) – వ్యవసాయం,
ముడావత్ చందు అలియాస్ చంద్రు (41) – కారు డ్రైవర్, వీరు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట్ మండలానికి చెందినవారనీ తెలిపారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
9 తులాల బంగారు నగలు
12 తులాల వెండి నగలు
మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు
రెండు సెల్ ఫోన్లు
ఒక చేతి గడియారం
స్క్రూడ్రైవర్, ఇనుప రాడ్
నమోదైన కేసులు
బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్లాపూర్, వెంకట్రావుపల్లె, రేగులపల్లి గ్రామాల్లో మహిళల మెడల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులు నమోదయ్యాయి. అలాగే కొమురవెల్లి పరిధిలో కిష్టంపేట గ్రామంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్ట్ చేసిన నిందితులపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో అనేక పాత కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు.ఈ కేసులను ఛేదించిన హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, సీసీఎస్, ఐటీ కోర్ బృందాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ అభినందించారు.



