**
షాద్నగర్ ప్రజావాణి, ఆగస్టు 05: షాద్నగర్ ప్రధాన చౌరస్తా విస్తరణ పనులకు సహకరిస్తూ దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గౌరవప్రదంగా తొలగించే ప్రక్రియకు వైసీపీ యువ నాయకుడు శీలం శ్రీను స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.
పట్టణ అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని చౌరస్తా విస్తరణ అవసరమని పేర్కొన్న ఆయన, అభివృద్ధి పనులకు తమవంతు సహకారం అందించడం బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.
అయితే ప్రజల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పట్ల ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని, విగ్రహాన్ని పట్టణంలో తగిన ప్రదేశంలో పూర్తి గౌరవంతో తిరిగి ప్రతిష్ఠించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఈ విషయంపై అధికారులతో చర్చలు జరగగా, విగ్రహాన్ని త్వరితగతిన కొత్త ప్రదేశంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
పట్టణ అభివృద్ధి పనులకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, అదే సమయంలో ప్రజల మనోభావాలను గౌరవించేలా విగ్రహ పునఃప్రతిష్ఠ చేపట్టాలని శీలం శ్రీను విజ్ఞప్తి చేశారు.
స్థానికుల అభిప్రాయం ప్రకారం, చౌరస్తా విస్తరణ పనులకు ఈ చర్యతో మరింత వేగం చేకూరే అవకాశం ఉంది.
షాద్నగర్ చౌరస్తా విస్తరణకు సహకారం.. వైఎస్ఆర్ విగ్రహం గౌరవప్రదంగా తొలగింపు
RELATED ARTICLES




