ఘాట్ కేసర్ , మే 4 (ప్రజావాణి): రైల్వే శాఖలో పోస్టుల తగ్గింపు నిర్ణయంపై అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత రైల్వే బోర్డు ఇటీవల ప్రకటించిన “ మ్యాన్ పవర్ రేషనలైజేషన్ 2026–27” ప్రకారం సుమారు 2 శాతం పోస్టులు (29,608) తగ్గించే చర్యలు తీసుకోవడం యువత భవిష్యత్తుకు విఘాతం కలిగిస్తుందని విమర్శించింది.
హిమాయత్నగర్లో జరిగిన సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ, ఇప్పటికే రైల్వేల్లో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా పోస్టులను తగ్గించడం అన్యాయమని పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 14.8 లక్షల పోస్టుల్లో ప్రస్తుతం కేవలం 11 లక్షల మంది మాత్రమే పనిచేస్తుండగా, 3–4 లక్షల వరకు ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
“మానవశక్తి హేతుబద్ధీకరణ” పేరుతో నియామకాలను నియంత్రించడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడ్డారు. సిబ్బంది కొరత రైల్వే సేవలపై, ప్రజల భద్రతపై కూడా ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.
అలాగే రైల్వే నియామక బోర్డు (ఆర్ ఆర్ బి) ద్వారా నిర్వహించిన పలు పరీక్షల ఫలితాలు పెండింగ్లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, నియామక ప్రక్రియలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మే 5 నుంచి 7 వరకు పోస్టుకార్డులు, ఈమెయిల్స్ ద్వారా నిరసన కార్యక్రమాలు నిర్వహించి, మే 8న హైదరాబాద్లోని రైల్ నిలయం వద్ద ముట్టడి చేపడతామని ప్రకటించారు.
సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు నేర్లకంటి శ్రీకాంత్, అరుణ్, మనోజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

