దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి
జర్నలిస్టులపై మూకదాడి ప్రజాస్వామ్యంపై దాడే..!
దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి డిమాండ్
మేడిపల్లి,జూన్ 28( మన ప్రజావాణి) సమాజానికి నిజాలను చేరవేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి తీవ్రంగా ఖండించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ అంబేద్కర్ నగర్లో జరిగిన ఘటనలో జర్నలిస్టు విష్ణుపై మూకుమ్మడిగా దాడి చేయడం,అతని ఇంటిపై రాళ్లు రువ్వడం,కుటుంబ సభ్యులను భయభ్రాం తులకు గురిచేయడం, వాహనాలను ధ్వంసం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో సీఐ జలంధర్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.కాలనీలో జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను విధి నిర్వహణలో భాగంగా చిత్రీకరిస్తున్న జర్నలిస్టుపై దాడి చేయడం మీడియా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నమని అన్నారు. ప్రజలకు సమాచారం అందిస్తున్న విలేకరులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడటం ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు.జరిగిన ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని,కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల భద్రతకు పోలీసులు పూర్తి హామీ ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ముఖ్య సలహా దారులు కల్కూరి ఎల్లయ్య, వి.సూర్యనారాయణ రెడ్డి, అధ్యక్షుడు శ్రీదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి. సుందర్,కోశాధికారి మరాటి మల్లేష్,ఉపాధ్యక్షుడు చింత రమేష్,రాము యాదవ్, నాగరాజు,శ్రీనివాస్, బుచ్చిరెడ్డి,భాస్కర్, మత్స్యగిరి,భగీరథ్ రెడ్డి, కమలాకర్,కుమారస్వామి, ప్రవీణ్,వెంకట్,ఉపేందర్, సిద్ధు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.





