హెచ్ఎంఎస్ నల్ల బ్యాడ్జీల నిరసన
శ్రీరాంపూర్,జూలై21,ప్రజావాణి:
సింగరేణి యాజమాన్యం ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డులో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరసిస్తూ హెచ్ఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు, ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ఇందారం వన్ ఏ, ఇందారం ఓసీపీ గనుల వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు తిప్పారపు సారయ్య మాట్లాడుతూ.. గత 30 నెలలుగా సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల సుమారు రెండు వేల మంది దరఖాస్తుదారులైన కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసు కాలం పూర్తి కావస్తున్న తరుణంలో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. మొదటి విడత ‘బాయి బాట’ కార్యక్రమానికి వచ్చిన కల్వకుంట్ల కవితను కార్మికులు కలిసి తమ బాధలను చెప్పుకోగా, జూలై 20వ తేదీ లోపు బోర్డు నిర్వహించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆమె యాజమాన్యాన్ని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు.
దీంతో దిగివచ్చిన సింగరేణి యాజమాన్యం అట్టహాసంగా మెడికల్ బోర్డు ప్రకటించి, కేవలం 120 మందిని మాత్రమే పిలిచిందని విమర్శించారు. అందులోనూ కేవలం 24 మందిని మాత్రమే మెడికల్ అన్ఫిట్గా ప్రకటించి, మిగిలిన 2,000 మంది దరఖాస్తుదారులకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని మెడికల్ అన్ఫిట్ చేసి, వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే నెలలో రెండు సార్లు మెడికల్ బోర్డులు నిర్వహించాలన్నారు. లేనిపక్షంలో కవితక్క నేతృత్వంలో ఆమరణ దీక్ష తప్పదని హెచ్చరించారు. గత 30 నెలలుగా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు కార్మిక సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని, గనుల వద్ద ఆయా సంఘాలను కార్మికులు నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, సెంట్రల్ ఉపాధ్యక్షులు మీస కొమురయ్య, దుర్గం లక్ష్మణ్, పులి రాజేందర్, ఎస్కే వలి, తన్వీర్, కండె సమ్మన్న, దస్తగిరి, రెహమాన్, కొట్టే సురేష్, కొల్లూరు శ్రీనులతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.




