మఠంపల్లి మోడల్ స్కూల్ లో అమ్మ పేరుతో ఒక మొక్క హరిత కార్యక్రమం విజయవంతం.
మఠంపల్లి, జూలై 29 ప్రజావాణి:
పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ పట్ల విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో తెలంగాణ గ్రీన్ కార్ప్స్ (టీజీ ఎన్జీసి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మ పేరుతో ఒక మొక్క(Sowing to Growing – 2026) కార్యక్రమాన్ని తెలంగాణ మోడల్ స్కూల్, మఠంపల్లి లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ తయారు చేయడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.
అంతేకాకుండా పాఠశాలలో గ్రీన్ టీచర్ (నోడల్ టీచర్) నియామక ప్రక్రియను చేపట్టి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సంవత్సరం పొడవునా సమర్థవంతంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. నేడు మనం నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు అమూల్యమైన సంపద. విద్యార్థులు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి హరిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చురుకుగా పాల్గొని హరిత తెలంగాణ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.




