ఘాట్ కేసర్, జులై 22 : అన్నోజిగూడ సర్వే నెంబర్ 92కి సంబంధించిన భూ వ్యవహారంలో బాలగోని బాలరాజు గౌడ్పై కావాలని కొందరు స్థానిక నాయకులు, స్వార్థపరులు రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని, లేనిపోని తప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నారని పట్టేదారు బాలగోని రాజయ్య వారసుడు బాలగోని సుమన్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా అబద్ధపు ప్రచారాలతో పూట గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం వారి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒరిజినల్ బ్లూప్రింట్ కాపీలను మీడియాకు చూపిస్తూ సుమన్ గౌడ్ మాట్లాడారు.. అన్నోజిగూడలోని సర్వే నెంబర్ 92లో గతంలో గ్రామపంచాయతీ అనుమతితో వేసిన లేఅవుట్లో 132 ప్లాట్లను చేశామని, అందులో 25 అడుగుల రోడ్డు మాత్రమే ఉందని సుమన్ గౌడ్ స్పష్టం చేశారు. కానీ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం 25 అడుగుల రోడ్డును 40 అడుగుల రోడ్డంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను, ప్లాట్ల కొనుగోలుదారులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలు చేసేవాళ్ల దగ్గర ఎలాంటి అసలు లేఅవుట్ కాపీలు లేవని, ఒరిజినల్ బ్లూప్రింట్ పత్రాలు తమ వద్దే భద్రంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

బాలరాజు గౌడ్ని రాజకీయంగా దెబ్బతీసే కుట్ర!……న్యాయంగా, చట్టబద్ధంగా పోరాడుతున్న బాలగోని బాలరాజు గౌడ్ ప్రజాదరణను ఓర్వలేక, ఆయన ఎదుగుదలను అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే కొంతమంది స్థానిక నాయకులు వెనుక ఉండి ఈ కుట్రలకు తెరలేపారని సుమన్ గౌడ్ విమర్శించారు. లేఅవుట్లో ఇంకా 25 శాతం వాటా తమ వద్దే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు. అక్రమాలను ఎదుర్కొంటూ, న్యాయం వైపు నిలబడినందుకే బాలరాజు గౌడ్పై బౌన్సర్లని, రౌడీషీటర్ అని లేనిపోని ముద్రలు వేస్తూ ఆయన మంచితనాన్ని, ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని సుమన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సత్యం ఎప్పుడూ గెలుస్తుందని, చట్టబద్ధమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, తప్పుడు ప్రచారాలు చేసే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా సుమన్ గౌడ్ ఘాటుగా హెచ్చరించారు.




