సిద్దిపేట, ఏప్రిల్ 6, ప్రజావాణి
ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ విద్యాశాఖ మరియు ఈడబ్ల్యూఐడిసి అధికారులతో సమావేశం నిర్వహించి 2017-18 సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలు , కేజీబీవీలు మోడల్ స్కూల్ లలో చేపట్టిన అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, లేబరేటరీలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు మొత్తం 92 పనులు మరియు వివిధ రిపేర్లకు సంబంధించి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ చివరి దశలో ఉన్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అదేవిధంగా మిగతా పనులను మే చివరి వారంలోగా పూర్తిచేసి జూన్ లో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఏ పని కూడా పెండింగ్లో ఉండకుండా అన్ని పూర్తి చేసి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఈడబ్ల్యూఐడిసి ఈఈ శ్రీనివాస్ రెడ్డిని, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో విద్యా శాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.



