ఘట్కేసర్, ఏప్రిల్ 30 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం వార్డులో నెలకొన్న నీటి సమస్యలు, దోమల పెరుగుదలపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అధికారులను కోరారు.
పోచారం ప్రాంతంలో పెరుగుతున్న దోమల సమస్యను దృష్టిలో ఉంచుకుని ఫాగింగ్ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరారు. అలాగే ప్రజలకు నిరంతర నీటి సరఫరా కల్పించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వాటర్ మెన్, ఎలక్ట్రిషన్ల బదిలీలను నిలిపివేసి, వారిని యథాస్థానాల్లో కొనసాగించాల్సిందిగా కోరారు. సిబ్బంది మార్పులు జరిగితే సేవలపై ప్రభావం పడే అవకాశముందని అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు అబ్బవత్తిని నర్సింహ, జితేందర్ నాయక్, వేమురెడ్డి తదితరులు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తాకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సమస్యలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.




