రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో తీర్పు వెలువరించిన పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం.
పెద్దపల్లి జూలై 31 ప్రజావాణి :
రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చిన్నారిపై లైంగిక దాడి (పోక్సో) కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రామగిరి మండలం పన్నూర్ గ్రామం (శివరాంనగర్)కు చెందిన ఎం.డీ. రహీంపాషా (36), తండ్రి కాజ మియా అనే వ్యక్తిపై నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.
2020 నవంబర్ 5న తన 14 సంవత్సరాల కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రామగిరి పోలీసులు క్రైమ్ నెం. 138/2020 కింద సెక్షన్ 363 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేశారు. దర్యాప్తు సమయంలో బాధితురాలిని గుర్తించి వాంగ్మూలం నమోదు చేయగా, నిందితుడు రహీంపాషా ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మోసపూరితంగా తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడైంది.
దీంతో పోలీసులు సేకరించిన ఆధారాల మేరకు కేసులో సెక్షన్ 366-ఏ, 376(2)(3) ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 6ను చేర్చి ఆల్టరేషన్ మెమోను కోర్టులో సమర్పించారు. అప్పటి ఏసీపీ వి. ఉమేందర్, ఎస్ఐ ఏ. మహేందర్లు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. అనంతరం పక్కా ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టు విచారణ – శిక్ష ఖరారు:
ఈ కేసు పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు రాగా, న్యాయమూర్తి స్వప్నరాణి ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించారు. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డూ రవీందర్, భరోసా లీగల్ కౌన్సిలర్ ఎం. సాధ్యారాణి సమర్థవంతంగా వాదనలు వినిపించి కీలక పాత్ర పోషించారు.
పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి, ఏసీపీ మడుత రమేష్ ల పర్యవేక్షణలో సాక్షులను కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టిన మంథని సీఐ బుద్దె స్వామి, రామగిరి ఎస్ఐ టీ. శ్రీనివాస్, కోర్టు కానిస్టేబుల్ (సీడీఓ) ఎస్.కె. షాహాబాజ్ (పీసీ-648), లైజన్ ఆఫీసర్ పి. కోటేశ్వరరావు (హెచ్సీ-2465)లను రామగుండం పోలీస్ కమిషనర్ మరియు డీఐజీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.




