ఘట్కేసర్, మే 18: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పోచారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మీసాల రాజేష్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజల జీవనం తీవ్రంగా ప్రభావితమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీసాల రాజేష్ మాట్లాడుతూ… ఇంధన ధరలు పెరగడంతో పాలు, పెరుగు, పప్పులు, నూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే రవాణా ఖర్చులు, విద్యా ఖర్చులు, వైద్య ఖర్చులు సహా ప్రతి రంగంపై ప్రభావం పడుతుందని తెలిపారు.
చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషిస్తున్న ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాల వల్ల కొరత ఏర్పడితే దానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం దురదృష్టకరమని విమర్శించారు.
రాబోవు రోజులలో మరింత ధరలు పెరిగే అవకాశముందని కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెరిగిన ధరలను తగ్గించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకోవాలని మీసాల రాజేష్ విజ్ఞప్తి చేశారు.




