ఘట్కేసర్, జూలై 16: ఘట్కేసర్ మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రధానోపాధ్యాయురాలు కె. అఖిల, ఉపాధ్యాయురాలు సుధారాణి పోచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, పాఠశాల భవనానికి రంగులు వేయించడం, విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయడం, పాఠశాల చుట్టూ ఉన్న ప్రహరీ గోడను మరమ్మతు చేయించడం అత్యవసరమని వివరించారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన కర్రె రాజేష్ పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాలకు అవసరమైన రంగులను కట్టా ఆంజనేయులు గౌడ్, వినోద్ కుమార్ అందజేస్తారని, విద్యార్థుల కోసం బెంచీలను బద్లగూడ నాగేశ్ గౌడ్ విరాళంగా అందిస్తారని ప్రకటించారు. అలాగే ప్రహరీ గోడ మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కుమార్, శర్వణ్ నాయక్, మాజీ వార్డు సభ్యురాలు వాణి, పాఠశాల సిబ్బంది, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




