పసర గ్రామంలో నాసిరకం రోడ్ల పనులు – ప్రజలు అవస్థలు
.సాంక్షన్ అయిన రోడ్లపై మట్టి పోసి చేతులు దులుపుకుంటున్నారా?
గోవిందరావుపేట, జూలై 25:-ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో సాంక్షన్ అయిన రోడ్ల పనుల్లో నాసిరకం మట్టిని వినియోగిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గ్రామంలోని ప్రధాన రహదారులు మరియు లోపలి వీధులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, కాంట్రాక్టర్ సంబంధిత అధికారులతో కుమ్మక్కై నాణ్యత లేని ఎర్ర మట్టితో పనులు పూర్తి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వర్షం పడితే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయని, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు ఆసుపత్రికి వెళ్లాలన్నా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు జారిపడి గాయపడే ఘటనలు కూడా జరుగుతున్నాయని తెలిపారు.ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పేరుతో మంజూరు చేసిన నిధులు కాంట్రాక్టర్ జేబుల్లోకి వెళ్తున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడం లేదని ఆరోపించారు.ఈ విషయంపై పలుమార్లు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి MPDO దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతా ప్రమాణాలతో రోడ్లను తిరిగి వేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
లేనిపక్షంలో గ్రామస్తులందరం కలిసి MRO ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి నాసిరకం పనులపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పసర గ్రామ ప్రజలు కోరుతున్నారు.


