ఘట్కేసర్, ఆగస్టు 2: ఘట్కేసర్ మండలం అన్నజిగూడలోని ఆర్థిక కాలనీలో కిడ్నీలు విఫలమై తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జర్నలిస్టు సంజయ్ కుమార్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దం నరసింహారెడ్డి మానవతా దృక్పథంతో రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసముంటున్న సంజయ్ కుమార్ గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పనిచేయక తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బద్దం నరసింహారెడ్డి ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వైద్య చికిత్స కోసం తనవంతు సహాయంగా రూ.10 వేల నగదు అందజేశారు.
ఈ సందర్భంగా బద్దం నరసింహారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సంజయ్ కుమార్ త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేష్ గౌడ్, మెట్టు నరసింహారెడ్డి, తిరుమల్ రెడ్డి, వంగాల లక్ష్మి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




