📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguబలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాది ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను విజయవంతం చేయాలి.

బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాది ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను విజయవంతం చేయాలి.

📰 Generate e-Paper Clip

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి తల్లి తన బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తల్లిపాలు అందించాలని తెలిపారు. తల్లిపాలు శిశువుకు సురక్షితమైనవి, స్వచ్ఛమైనవి, పోషక విలువలు కలిగినవని, శిశువు ఆరోగ్యవంతంగా ఎదగడానికి తల్లిపాలే బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తల్లిపాలు ఎంతో అవసరమని, కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు. తల్లిపాలు అందించడం ప్రతి బిడ్డ హక్కు అని, ప్రతి తల్లి తన మాతృత్వ బాధ్యతను గుర్తించి పిల్లలకు తల్లిపాలు అందించాలని కోరారు.
తల్లులు తీసుకునే పోషకాహారం ద్వారానే స్వచ్ఛమైన పాలు బిడ్డలకు అందుతాయని, దీంతో పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదుగుతారని తెలిపారు. బలమైన బాల్యానికి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తల్లులను ప్రోత్సహించి, ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తల్లి పాల వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తల్లులందరికీ ప్రపంచ తల్లి పాల వారోత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు.

బై రిపోర్టర్‌ గొల్లపెల్లి శ్రీకాంత్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular