📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్చిన్న పత్రికలైనా,యూట్యూబ్ ఛానెళ్లయినా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభాలే: చిన్నచూపు చూసేవారికి కాలమే సమాధానం చెబుతుంది!

చిన్న పత్రికలైనా,యూట్యూబ్ ఛానెళ్లయినా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభాలే: చిన్నచూపు చూసేవారికి కాలమే సమాధానం చెబుతుంది!

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్ జూలై 20 ప్రజావాణి పెద్ద మీడియా సంస్థలదే హవా,కార్పొరేట్ శక్తులదే రాజ్యం అనుకుంటూ,సమాజంలో క్షేత్రస్థాయి సమస్యలను వెలికితీసే చిన్న పత్రికలను,డిజిటల్ విప్లవంతో దూసుకుపోతున్న యూట్యూబ్ ఛానెళ్లను కొంతమంది చిన్నచూపు చూడటం వారి అజ్ఞానానికి పరాకాష్ట.కేవలం కోట్లాది రూపాయల టర్నోవర్ ఆకాశాన్నంటే భవనాలు ఉంటేనే మీడియా సంస్థలు అనుకుంటే పొరపాటే.నిజమైన జర్నలిజం సమాజపు అట్టడుగు వర్గాల గొంతుకను వినిపించడంలోనే ఉంది.ఈ రోజుల్లో సత్యనిష్టతో పనిచేస్తున్న చిన్న పత్రికలు,స్వతంత్ర యూట్యూబ్ జర్నలిస్టులు చేస్తున్న పోరాటం,పెద్ద పెద్ద కార్పొరేట్ మీడియా సంస్థల కంటే ఎంతో మిన్నగా ఉందనేది అక్షర సత్యం.
పెద్ద పత్రికల నీడన దాగని నిజాలు.చిన్న పత్రికల పోరాటాలు:
ఒకప్పుడు సమాచార విప్లవానికి పత్రికలే మూలస్తంభాలు.కాలక్రమేణా పెద్ద పత్రికలు చాలావరకు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకో,లేదా రాజకీయ ప్రయోజనాల కోసమో పనిచేసే సాధనాలుగా మారిపోయాయి.ప్రకటనల కోసం,సొంత లాభాల కోసం కొన్ని పెద్ద మీడియా సంస్థలు నిజాలను నొక్కేస్తున్న తరుణంలో. నిర్భయంగా,నిష్పక్షపాతంగా వార్తలను ప్రజల ముందుకు తెస్తున్నవి చిన్న పత్రికలే. స్థానిక సమస్యల నుంచి,పాలకుల అవినీతి అక్రమాల వరకు ఎలాంటి భయం లేకుండా నిలదీసే ధైర్యం చిన్న పత్రికల సంపాదకులకు,విలేకరులకు ఉంది.వారి వద్ద భారీ బడ్జెట్‌లు లేకపోవచ్చు,కానీ సమాజం పట్ల అంతులేని బాధ్యత ఉంది.అలాంటి వారిని తక్కువ అంచనా వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.
డిజిటల్ విప్లవ-యూట్యూబ్ ఛానెళ్ల ప్రభంజనం:
ఈనాడు సమాచార రంగంలో యూట్యూబ్ ఛానెళ్లు సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు పెద్ద మీడియా సంస్థలు ఏ వార్త చెబితే అదే ప్రజలు నమ్మాల్సి వచ్చేది.కానీ నేడు యూట్యూబ్ ఛానెళ్లు ఆ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాయి.మెయిన్ స్ట్రీమ్ మీడియా దాచేస్తున్న నిజాలను,తొక్కిపెడుతున్న ప్రజా సమస్యలను సోషల్ మీడియా వేదికగా,యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నేరుగా ప్రజల ముందుకు తెస్తున్నారు. ఒక స్మార్ట్‌ఫోన్,ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.కోట్లాది మందికి నిజాలను చేరవేయవచ్చని నేటి తరం డిజిటల్ జర్నలిస్టులు నిరూపించారు. బ్రేకింగ్ న్యూస్ ల పేరుతో పెద్ద ఛానెళ్లు గంటల తరబడి సోది చెప్తుంటే,యూట్యూబ్ ఛానెళ్లు నిమిషాల్లో అసలు నిజాన్ని విశ్లేషించి ప్రజల ముందు పెడుతున్నాయి.
చిన్నచూపు చూసేవారికి ఒకటే హెచ్చరిక:
చిన్న పత్రికలు,యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడే అధికార గణం కానీ,సమాజంలోని కొందరు వ్యక్తులు కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి.ఈ రోజు పెద్ద మీడియా సంస్థలు కూడా సోషల్ మీడియా వేదికలపైనే ఆధారపడి బతుకుతున్నాయి.నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రతి గొంతుకకూ విలువ ఉంటుంది.క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై,వారి సుఖదుఃఖాలను పంచుకుంటూ,న్యాయం కోసం పోరాడే ప్రతి చిన్న పత్రికా,ప్రతి యూట్యూబ్ ఛానెల్ ఒక శక్తివంతమైన ఆయుధమే. వాటిని నిర్లక్ష్యం చేయడం అంటే ప్రజల గొంతును నొక్కేయడమే అవుతుంది.మార్పు ఎప్పుడూ పైనుంచి రాదు,క్షేత్రస్థాయి నుంచే మొదలవుతుంది. ఆ మార్పుకు మూలబిందువులు ఈ చిన్న పత్రికలు మరియు యూట్యూబ్ ఛానెళ్లే. ఇకనైనా ఆ అహంకారాన్ని వీడి,పారదర్శక జర్నలిజానికి మద్దతు ఇవ్వడం అందరి బాధ్యత,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular