ఘట్కేసర్, మే 16: ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఘట్కేసర్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తై ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తూ యువమోర్చా అధ్యక్షులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘట్కేసర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తై ప్రజలకు ఇబ్బందులు తొలగాలని దేవుడిని ప్రార్థించానన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు తాను పాదరక్షలు ధరించనని శపథం చేసి తన సంకల్పాన్ని వెల్లడించారు.
ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు బ్రిడ్జి పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. కొమ్మిడి విక్రాంత్ రెడ్డి తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం స్థానిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

