ఘాట్ కేసర్ మే 19: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా పౌరులకు మెరుగైన సేవలు అందించే దిశగా పరిష్కరించాల్సిన వివిధ పారిశుధ్య సమస్యలపై సంబంధిత సెక్షన్ అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఘట్కేసర్ వార్డ్లోని ఎన్ఎఫ్సీ నగర్లో కొనసాగుతున్న జనగణన (సెన్సస్ ఎనిమరేషన్) ప్రక్రియను పరిశీలించి, సర్వే పనులను కచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. అలాగే ఎస్ డబ్ల్యూ జి ( సానిటరీ వర్కర్స్ గ్రూప్) కార్మికులతో సమావేశమై, వారి సంక్షేమం మరియు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని సేఫ్టీ గేర్ను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఎదులాబాద్ వార్డ్లోని ఊర్వైగడ్డ ప్లేగ్రౌండ్ను సందర్శించి, అక్కడ క్రీడాకారులు మరియు స్థానిక ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వాణి , ఇంజనీరింగ్ విభాగం డి.ఈ నరేష్ , శానిటేషన్ విభాగం ( ఎస్ డబ్ల్యూ ఎం) డి.ఈ శ్రీనివాస్ , ఏఈఈ చంద్రశేఖర్, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



