రేకొండలో పంచాయతీ భవనానికి భూమి పూజ చేసిన ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి
మన ప్రజావాణి ప్రతినిధి, (చిగురుమామిడి):గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు. సోమవారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పల్లెలే దేశానికి బలం అన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. రేకొండలో నూతన భవనం నిర్మాణం పూర్తయితే గ్రామ సభలు నిర్వహించడం సులభమవడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరితగతిన అందుబాటులోకి వస్తాయని చెప్పారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు. రేకొండ గ్రామ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లేపు సంపత్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఏఈ నిరంజన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోదారి అజయ్ కుమార్, ఉప సర్పంచ్ బిల్ల సంతోష్ రెడ్డి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
