ఘట్కేసర్, జూలై 19: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్లోని ఉత్తర శ్రీవిల్లిపుత్తూరుగా ప్రసిద్ధి చెందిన గరుడాద్రి క్షేత్రం ఆదివారం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. శ్రీ గోదాదేవి (ఆండాళమ్మ) తల్లికి నిర్వహించిన లక్ష గాజుల మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో గాజులమ్మగా కొలువుదీరిన అమ్మవారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం గజవాహన సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు వేదమంత్రోచ్ఛారణల మధ్య లక్ష గాజులను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహోత్సవంలో భాగంగా జరిగిన కుంకుమార్చనలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సౌభాగ్యం, సంతానప్రాప్తి, వివాహయోగం, కుటుంబ సుఖశాంతి, ఐశ్వర్యం కలగాలని కోరుతూ అమ్మవారికి గాజులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొక్కులు తీర్చుకున్న భక్తులు గాజులను సమర్పించడం విశేషంగా కనిపించింది.
అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయడంతో పాటు అమ్మవారి గాజులను అందజేశారు. కార్యక్రమం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణలతో మారుమోగింది.
ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు పవనాచార్యులు, ఫణికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ, తొలిసారిగా నిర్వహించిన లక్ష గాజుల మహోత్సవానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. గరుడాద్రి క్షేత్రం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత విస్తరించేలా భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
గాజులమ్మగా దివ్య దర్శనం ఇచ్చిన శ్రీ గోదాదేవి తల్లి ఆశీస్సులు పొందేందుకు తరలివచ్చిన భక్తులతో గరుడాద్రి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడగా, లక్ష గాజుల మహోత్సవం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చింది.




