- ఇంటి అనుమతుల వ్యవహారంపై కలెక్టర్ సీరియస్.. మల్కాపూర్ పంచాయతీలో రికార్డుల జల్లెడ!

• రికార్డులు, ఆన్లైన్ డేటాపై సమగ్ర తనిఖీ.
• మరిన్ని అక్రమాలపై విచారణ జరపాలని వార్డు సభ్యుల డిమాండ్.
కొండాపూర్, జూన్ 10 (ప్రజావాణి):
కొండాపూర్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ మల్కాపూర్లో ఇంటి నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఫిర్యాదు జిల్లా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ ఉమాహారతి బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక విచారణ నిర్వహించి సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం గతంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ సరైన అనుమతులు మంజూరు కాలేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులు గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఇంటి నిర్మాణ అనుమతులకు సంబంధించిన దస్త్రాలు, ఆన్లైన్ నమోదు వివరాలు, రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై అన్ని కోణాల్లో విచారణ జరిపి వాస్తవాలను సేకరించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఉమాహారతి మాట్లాడుతూ, ఫిర్యాదులోని అంశాలను రికార్డులు మరియు ఆన్లైన్ డేటా ఆధారంగా పరిశీలించామని, పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. గ్రామపంచాయతీలో అనుమతుల జారీ ప్రక్రియ నిబంధనల మేరకు జరుగుతున్నదా అనే అంశాన్ని కూడా పరిశీలించినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యుల బృందం సబ్ కలెక్టర్ను కలిసి ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు వాస్తవాలకు విరుద్ధమని పేర్కొంటూ తమ వాదనలు వినిపించింది. ఇంటి నిర్మాణ అనుమతుల ప్రక్రియ మొత్తం నిబంధనల ప్రకారమే నిర్వహించబడిందని, అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు సమర్పించినట్లు తెలిపింది.
అలాగే గ్రామంలో అనుమతులు లేకుండానే ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించడం, సంబంధిత అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై కూడా సమగ్ర విచారణ జరపాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై త్వరలోనే ప్రజావాణిలో ప్రత్యేక ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ విచారణలో డీపీఓ మల్లారెడ్డి, డీఎల్పీఓ అనిత, ఎంపీడీఓ సౌమ్యశ్రీ, ఎంపీవో మహేందర్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.





