సిద్దిపేట్, మార్చి 20, ప్రజావాణి
సోషల్ మీడియా వేదికగా వాస్తవాలను వక్రీకరించి, మత సామరస్యానికి భంగం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వ్యక్తిపై సిద్దిపేట టూ టౌన్ లో కేసు నమోదు.సిద్దిపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదురుగా ఉన్న ధరిపల్లి వెంకటయ్య అనే వ్యక్తికి చెందిన స్వంత స్థలంలో, వారి తాతముత్తాతల కాలం నుండి పెద్ద గుట్ట దర్గాకు గుర్తుగా ఒక పురాతన చిల్లా ఉంది. ఆ చిల్లా కొంత కాలంగా శిథిలావస్థకు చేరడంతో, యజమానులు దానికి మరమ్మతులు (రిపేరు) చేపట్టి పునర్నిర్మిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని గమనించిన సిద్దిపేట సాజిద్ పూరాకు చెందిన జహంగీర్ అనే వ్యక్తి, ఆ చిల్లాను ఎవరో కూలగొడుతున్నారంటూ తప్పుడు అర్థం వచ్చేలా వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశాడు. ఈ తప్పుడు సమాచారం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో, సిద్ధిపేట టూ పోలీసులు తక్షణమే స్పందించి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.సదరు చిల్లా ధరిపల్లి వెంకటయ్య వారి పూర్వీకులు తమ స్వంత ఆరాధన కోసం వారి స్వంత స్థలంలో నిర్మించుకున్నది. దానిని వారు ప్రస్తుతం కేవలం పునర్నిర్మాణం మాత్రమే చేస్తున్నారు. వీడియోలు లేదా ఫోటోలతో ఎవరైనా కావాలని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, వర్గ విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ, ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అన్ వెరిఫైడ్ (ధృవీకరించని) వార్తలను, వదంతులను నమ్మవద్దని సిద్దిపేట పోలీసులు కోరుతున్నారు.శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ కోరారు.




