జుక్కల్ మహాదేవ్ ఆలయం వద్ద ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు
అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
జుక్కల్, మార్చి 07 (ప్రజావాణి):
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని మహాదేవ్ ఆలయం సమీపంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారి స్థానిక ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఆలయం వద్ద ఉన్న చెట్టుకు చెందిన కొమ్మ విరిగి విద్యుత్ లైన్పై పడటంతో వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి.
ఈ ఘటన జరిగి మూడు రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని జుక్కల్ ఏఈ మరియు లైన్మెన్లకు పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ వారు స్పందించకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మహాదేవ్ ఆలయం ప్రాంతం ప్రజలు తరచూ రాకపోకలు చేసే ప్రదేశం కావడంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లాలంటే ప్రాణాలు చేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని వారు అంటున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లుగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఉందని గ్రామస్తులు మండిపడుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించకపోతే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.




