*వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు*
*డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు.. దామర ఎస్సై వీరభద్రరావు*
*మండపాల కమిటీ సభ్యులు పోలీసుల సూచనలు తప్పక పాటించాలి*
ప్రజావాణి హనుమకొండ బ్యూరో
దామర సెప్టెంబర్ 19: వినాయక నిమజ్జనం సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేదని దామర ఎస్సై వీరభద్రరావు స్పష్టం చేశారు. పోలీసుల నిబంధనలను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దామర పోలీస్స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.
కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి
వినాయక మండపాల ఏర్పాటుకు నమోదు చేసుకున్న కమిటీ సభ్యులు నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలు తప్పక పాటించాలని ఎస్సై సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
చెరువుల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి
వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో చెరువులు, ఇతర నిమజ్జన ప్రదేశాల వద్ద నిర్వాహకులు, భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వీరభద్రరావు సూచించారు. ప్రజల భద్రత కోసం గ్రామాల్లో పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఏవైనా సమస్యలు తలెత్తినా, అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.

