మంచినీటి సమస్య తీర్చాలి
ఖాళీ బిందెలు,బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన
మహబూబాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి, సెప్టెంబర్ 15(ప్రజా వాణి )గార్ల పట్టణంలో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు,మహిళలు భారీ ఎత్తున ఖాళీ బకెట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు.ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు.ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

