గణేష్ వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మండపాల వద్ద సీసీ కెమెరాలు.. డీజేలకు నో పర్మిషన్
నెక్కొండ సీఐ ఫణీందర్
చెన్నారావుపేట సెప్టెంబర్ 11 ప్రజావాణి
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు పూర్తి భద్రతతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నెక్కొండ సీఐ ఫణీందర్ సూచించారు. చెన్నారావుపేట పోలీస్స్టేషన్లో శుక్రవారం గణేష్ మండపాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు.మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని, మండపాల్లో విద్యుత్ వైరింగ్, లైటింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి మండపం వద్ద పగలు, రాత్రి కనీసం ఇద్దరు నిర్వాహకులు అందుబాటులో ఉండాలని, చైన్ స్నాచింగ్, ఈవ్టీజింగ్, ఇతర అవాంఛనీయ ఘటనల నివారణకు రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సౌండ్ సిస్టమ్ను నిర్ణీత పరిమితుల్లోనే వినియోగించాలని, డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు.మైక్, స్పీకర్ల వినియోగానికి సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఇసుక బకెట్లు, నీటి డ్రమ్ములు సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నిమజ్జనాన్ని రాత్రి 10 గంటల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాండ్, కోలాటం వంటి సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉస్మాన్, ఇస్తారి, రాజు, పూలమ్మ, వినాయక నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.


