పెండింగ్ కేసులలో జాప్యం చేస్తే కఠిన చర్యలు
జీరో ఎఫ్ఐఆర్ ను తక్షణమే నమోదు చేయాలి
సైబర్, ప్రాపర్టీ నేరాలపై కఠిన చర్యలు
CCTNS అప్డేట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలి
ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఐ పి ఎస్
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):-
ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఐ పి ఎస్ ఆధ్వర్యంలో ఆగష్టు నెల క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ASP ఏటూరునాగారం మనన్ భట్ ఐపీస్ , ములుగు డీఎస్ పి నలువాల రవీందర్ తో పాటు సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించి, కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.జీరో ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి, అక్కడ తక్షణమే ఎఫ్ఐఆర్ రీ-రిజిస్ట్రేషన్ చేసి తదుపరి దర్యాప్తును చేపట్టేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.అలాగే జిల్లాలో నమోదైన సైబర్ క్రైమ్ కేసుల పురోగతిని సమీక్షిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు పురోగతితో పాటు CCTNSలో కేసు వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు.రానున్న గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. స్థానిక ప్రజలు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపారు.ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. నిబద్ధతతో పనిచేసిన అధికారులకు ప్రశంస పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు సిఐ దారం సురేష్ పసర సిఐ దయాకర్ ఎటురునాగారం సిఐ సూర్యప్రకాష్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆర్ఐ అడ్మిన్ రాధారత్ స్వామి రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆపరేషన్ తిరుపతి ఆర్ ఐ ఎం టి ఓ వెంకటనారాయణ స్థానిక స్టేషన్ హౌస్ అధికారులు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

