పాఠశాలలో విద్యార్థులను ఆకట్టుకుంటున్న సృజనాత్మక చిత్రాలు
బెజ్జంకి, సెప్టెంబర్ 5 (ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిని స్థానిక దాతల సహకారంతో రైలు బోగీని తలపించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు.
విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించేలా పాఠశాలలో రంగురంగుల చిత్రాలను వేస్తున్నారు. ఇందులో భాగంగా తరగతి గది కిటికీలను రైలు కిటికీలుగా చిత్రీకరించి, రైలు బోగీ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్నట్లుగా అందంగా రూపొందించారు.ఈ వినూత్న అలంకరణ విద్యార్థులను, గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తరగతి గదిలో కూర్చున్న విద్యార్థులు తాము నిజంగానే రైలులో ప్రయాణిస్తున్నామన్న అనుభూతిని పొందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.దాతల చొరవతో చేపట్టిన ఈ సృజనాత్మక ప్రయత్నం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతూ.. వారి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది.

