హెల్మెట్ ధరించండి – సురక్షితంగా ప్రయాణించండి
విద్యార్థులే రోడ్డు భద్రతకు రాయబారులుగా మారాలి.
డీటీఓ అఫ్రీన్ సిద్ధిఖీ.
ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తిలోని సెయింట్ థామస్ హైస్కూల్లో విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు బుధవారం రోడ్డు రవాణా టూ వీలర్ హెల్మెట్ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా అధికారి (డీటీఓ) అఫ్రీన్ సిద్ధిఖీ,అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వైష్ణవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీటీఓ అఫ్రీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని అన్నారు.హెల్మెట్ ధరించడం వల్ల తలకు తీవ్రమైన గాయాలు కాకుండా రక్షణ లభిస్తుందని,హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల చిన్న ప్రమాదం కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని వివరించారు.విద్యార్థులు తమ తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రతిసారీ హెల్మెట్ ధరించేలా గుర్తు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని,అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం,మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ,విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు.చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నిబంధనలు,హెల్మెట్ ప్రాముఖ్యత,రోడ్డు భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తే వారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.విద్యార్థులు పాఠశాలలో నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు,కుటుంబ సభ్యులకు తెలియజేసి సమాజంలో రోడ్డు భద్రతపై చైతన్యం తీసుకురావాలని కోరారు.ప్రభుత్వం,రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో తరచూ నిర్వహించాలని,విద్యార్థుల ద్వారా ప్రతి కుటుంబానికి రోడ్డు భద్రత సందేశం చేరేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఇటువంటి కార్యక్రమాలకు సెయింట్ థామస్ హైస్కూల్ యాజమాన్యం ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మర్రిఅశోక్,వైస్ ప్రిన్సిపల్ లింగం మొగిలి,వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రె తిరుపతి,ఉపాధ్యాయులు లావణ్య,సరిత,సురేష్, ఆశాబేగం,రమేష్, సుమలత,లత,కృష్ణ, కవిత,కళ్యాణి,స్వప్న తదితరులు,పాఠశాల సిబ్బంది,పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.




