భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
.వాగులు దాటవద్దు – SDPO రవీందర్ విజ్ఞప్తి.
.24 గంటలు పోలీస్ పెట్రోలింగ్.
*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*
ములుగు సబ్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని SDPO ఎన్. రవీందర్ గారు విజ్ఞప్తి చేశారు.
వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, రహదారులపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను వరద నీటి ప్రాంతాలకు పంపవద్దని రైతులు, పశువుల కాపరులు వర్షం, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని కోరారు.
వాహనదారులు ముఖ్యంగా రాత్రి వేళల్లో అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని, రహదారుల పరిస్థితి తెలుసుకున్న తర్వాతే ప్రయాణాలు చేయాలని సూచించారు.ఎక్కడైనా రోడ్లు దెబ్బతినడం, చెట్లు కూలడం, వరద నీరు చేరడం జరిగితే *విధిలో ఉన్న పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ములుగు పోలీసు సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలు, వాగులు, ప్రధాన రహదారులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నట్లు SDPO రవీందర్ పేర్కొన్నారు.
ప్రజలందరూ పోలీసు శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల హెచ్చరికలు పాటించి *తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మీ




