గురు పౌర్ణమి వేడుకల్లో యోగ గురువు నరసింహరావుకు ఘన సన్మానం
అమీన్పూర్, జూలై 29(ప్రజావాణి):గురు పౌర్ణమి సందర్భంగా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో యోగ సాధకులు తమ యోగ గురువు నరసింహరావు గారిని ఘనంగా సన్మానించారు. భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్న విశిష్ట స్థానాన్ని స్మరించుకుంటూ, ఆయన అందిస్తున్న యోగా శిక్షణ, ఆరోగ్య అవగాహన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా సాధకులు గురువుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. నరసింహరావు మాట్లాడుతూ, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాధకులు గురువుకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక, స్ఫూర్తిదాయక వాతావరణంలో జరిగింది.

